భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల వల్ల వైద్యుల సలహా మేరకు తక్షణమే రాజీనామా చేస్తున్నట్టు ఆయన సోమవారం ప్రకటించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఎ) ప్రకారం ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు. తాను ఉపరాష్ట్రపతిగా పనిచేసిన కాలంలో రాష్ట్రపతి అందించిన సహకారం ఎంతో స్ఫూర్తిదాయకమైందని పేర్కొన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రివర్గం అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రితో పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.
Also Read : లిక్కర్ స్కాంలో 7 డెన్ లు.. హైదరాబాద్ అడ్డాగా ఏపీ లిక్కర్ స్కాం

గతంలో ధన్ఖడ్ ఒక సందర్భంలో “భగవంతుడి ఆశీర్వాదంతో 2027 ఆగస్టులో పదవీ విరమణ చేస్తాను” అని వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు ఆనారోగ్య సమస్యల కారణంగా ముందుగానే పదవి వీడుతున్నారు. ఎంపీల నుంచి లభించిన అభిమానానికి, మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదే తన జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని అన్నారు. ఈ కాలంలో దేశం సాధించిన ఆర్థిక ప్రగతిని ప్రత్యక్షంగా చూడడం, దానికి సాక్షిగా ఉండడం తనకు గర్వంగా ఉందన్నారు. దేశానికి సేవ చేయడం నిజమైన గౌరవమని చెప్పారు. తన రాజీనామా సమయంలో భారత్ విశేషమైన విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో దేశ భవిష్యత్తు గొప్పదై ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read : ఎవరి కొడుకైనా టాలెంట్ ఉండాల్సిందే.. పవన్ సంచలన కామెంట్స్
ధన్ఖడ్ అసలు వృత్తి న్యాయవాది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే ముందు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచేశారు. బెంగాల్ గవర్నర్ గా ఉన్న సమయంలో సీఎం మమతా బెనర్జీతో అస్సలు పొసిగేది కాదు. నిత్యం వివాదాల నడుమ ఆయన కొనసాగారు. ఉపరాష్ట్రపతిగా ఆయన ఐదేళ్ల పదవీకాలం 2027 ఆగస్టు 10వ తేదీన ముగియాల్సి ఉంది. అయితే ఆరోగ్య కారణాలతో ఇప్పుడు పదవి నుంచి వైదొలుగుతున్నారు. తన రాజీనామాకు ముందు, ఆయన పార్లమెంటు వర్షాకాల సమావేశాలను రాజ్యసభ ఛైర్మన్గా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని రాజకీయ పక్షాలను ధన్ఖడ్ కోరారు.