సోమవారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్దమవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ సహా పలు కీలక అంశాల్లో ప్రభుత్వం ఇబ్బంది పడే సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేసాయి. కాని ఆ విషయంలో ప్రభుత్వం ముందడుగు వేయలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి తప్పలేదు.
Also Read : స్వపక్షంలో విపక్షం.. సీఎంపై ఫైర్..!
దీనితో వర్షాకాల సమావేశాలను వాడుకోవాలని విపక్షాలు వ్యూహాలు సిద్దం చేసాయి. పాకిస్తాన్తో కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా అధ్యక్షుడు పదేపదే వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దీనిపై ముందు నుంచి కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఇక బీహార్ ఓటర్ల జాబితా సవరణ చేయడం వంటి అనేక అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు ఏకతాటి మీద ముందుకు వెళ్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ సహా కీలక అంశాలపై చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది.
కానీ పహల్గాం ఘటనలో ఇప్పటి వరకు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకోకపోవడాన్ని విపక్షాలు గట్టిగా ప్రశ్నించే అవకాశం కనపడుతోంది. ఆగస్టు 21న ముగిసే ఈ సమావేశాల్లో ప్రభుత్వం 17 బిల్లులను ప్రవేశపెట్టనుంది. అహ్మాదాబాద్ విమాన ప్రమాదంపై కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ అంశాలపై ప్రధానమంత్రి స్పందించే అవకాశం లేదని జాతీయ మీడియా వెల్లడించింది.
Also Read : చిత్తూరు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలకు భయమా..?
ప్రతిపక్షాల సహకారం కోరుతూ, ఆపరేషన్ సిందూర్ గురించి చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇప్పటికే ప్రకటించారు. ఈ సెషన్లో ప్రవేశపెట్టబోయే బిల్లులలో మణిపూర్ జీఎస్టీ బిల్లు, పన్ను చట్టాలు (సవరణ) బిల్లు, జాన్ విశ్వాస్ (సవరణ) బిల్లు, జియోహెరిటేజ్ సైట్స్ మరియు జియో-రెలిక్స్ (సంరక్షణ మరియు నిర్వహణ) బిల్లు, జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు మొదలైనవి ఉన్నాయి.