భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ ముంబై జట్టు నుంచి గోవాకు మారాలని తీసుకున్న ఆకస్మిక నిర్ణయం బుధవారం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముంబై నుంచి గోవాకు వెళ్లాలని అనుకుంటున్నట్టు జైస్వాల్ మంగళవారం ముంబై క్రికెట్ అసోసియేషన్కు లేఖ రాశాడు. దీనికి వెంటనే ముంబై క్రికెట్ అసోసియేషన్ పాలకమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో అతను 2025-26 సీజన్ నుండి గోవా తరఫున ఆడతాడు. అక్కడ అతన్ని కెప్టెన్ గా నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read : ముంబై సెన్సేషన్ అశ్వనీ కుమార్ బ్యాక్ గ్రౌండ్ ఇదే
అయితే భారత జట్టు భారీగా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడుతున్న నేపధ్యంలో ఎంత వరకు దేశవాళి క్రికెట్ ఆడతాడు అనేది చెప్పలేని పరిస్థితి. ఇక జైస్వాల్ ఎందుకు ముంబైని వీడాలి అనుకున్నాడు అనే దానిపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. టీం ఇండియా వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే, జైస్వాల్ మధ్య ఉన్న విభేదాల కారణంగానే అతను ముంబై టీం నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. గత సీజన్లో జమ్మూ & కాశ్మీర్తో జరిగిన మ్యాచ్ లో.. జైస్వాల్ షాట్ సెలెక్షన్ పై రహానే అసంతృప్తి వ్యక్తం చేసాడు.
Also Read : రబాడాపై బీసీసీఐ పగ సాదిస్తోందా..?
షాట్ సెలెక్షన్ మార్చుకోవాలని సూచించగా దానికి జైస్వాల్ అసహనం వ్యక్తం చేసాడు. 2022లో ఒక మ్యాచ్లో రహానే.. జైస్వాల్ తీరుపై మండిపడ్డాడు. సౌత్ జోన్ బ్యాటర్ రవితేజను అతిగా స్లెడ్జింగ్ చేయడంతో.. జైస్వాల్ ను మైదానం నుంచి బయటకు పంపాడు రహానే. ఇక ఈ వ్యవహారంలో ముంబై జట్టు యాజమాన్యం రహానేకి మద్దతుగా నిలిచింది. కాగా ఈ విషయాన్ని బోర్డు పెద్దల దృష్టికి జైస్వాల్ తీసుకు వెళ్ళినా.. సైలెంట్ గా ఉండిపోయినట్టు సమాచారం. దీనితోనే ముంబై జట్టు నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.